Tuesday 22 January 2013

అన్నా తిరుమలరాయ..

తెలంగాణ మీద డిల్లీ నుండి వెళువడుతున్న ప్రకటనలకు ఇక్కడ సీమాంధ్ర నాయకులకు చురుకు తగులుతుంది. ఇప్పుడు అన్ని ప్రాంత నేతల వాదనలలో వేడి పెరిగింది. ఇన్నాళ్లు తెరచాటు రాజకీయాలు నడిపిన కే"వీపి" లు కూడా ఇప్పుడు లీడ్ రోల్ తీసుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి తప్ప తుచ్చమైన రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడదీయకూడదట.


ఈరోజే కాదు మరెప్పుడైనా తెలంగాణ అన్నది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది పార్టీల రాజకీయ లబ్దికోసకే ఏర్పడుతుంది తప్ప ఇక్కడ ప్రజల కోరికను మన్నించి ఎంత మాత్రం కాదు. అన్ని పార్టీలు తెలంగాణ భావోద్వేగాలను ఓట్లలా మలుచుకోవడానికే రెడీగా ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా లేవు.  అలాంటి నేపద్యంలో ఇప్పుడు కాంగ్రేస్ చేయబోతుంది అని అందరు అనుకుంటున్న పనిని తప్పుపట్టాల్సింది లేదు. అసలైన రాజకీయ నాయకుడు అధికారం కోసం దేన్నైనా విభజిస్తాడు, మరేదాన్నైనా కలుపుకొని పోతాడు. అది రాజకీయం.

జయశంకర్ సారు ఎప్పుడూ చెప్పేవాడు, తెలంగాణ ఏర్పాటు అన్నది రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యం అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా రాష్ట్ర ఏర్పాటు అన్నది పార్లమెంటులో  తేలాల్సిన విషయం కాబట్టి తాను తెలంగాణ కోసం పనిచేసే రాజకీయ పార్టీలకు మద్దతిస్తాను అని. 

ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రేస్ పెద్దల ఆలోచనలు ఇలా ఉన్నట్లు అవగతం అవుతుంది. రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రేస్ లో కలుపుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని సుమారుగా అన్ని సీట్లు కైవసం చేసుకోవచ్చు.  అంతేగాక తెలంగాణ నుండి టీయ్యారెస్ తప్ప ఏ ప్రాంతీయ పార్టీ లేదు కాబట్టి కాంగ్రేస్‌కు ఎదురు లేకుండా ఉంటుంది. వైయ్యెస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో మనుగడ సాగించడం  కష్టసాధ్యం.  కొత్త రాష్ట్రంలో బాబు పార్టీని, జగన్ పార్టిని ఒక మూలకు చేర్చి వాళ్ళిద్దరి పరపతిని తగ్గించవచ్చు. అదీగాక అవసరం అనుకుంటే జగన్ కు బేయిల్ ఇచ్చి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ మద్దతు కూడా కూడగట్టుకోవచ్చు.

ఒక వేళ ఇదే జరిగితే బాబు గారికి సర్వభ్రష్టత్యమే. ఇప్పటికే "వస్తున్నా మీకోసం" అని కాళ్లు అరిగిపోయేలా తిరుగుతున్నా పచ్చ పత్రికల భజన తప్ప ప్రజల స్పందన లేదు. అలాంటిది రేపు తెలంగాణ ఏర్పాటు చేసి బాబు గారిని సీమాంధ్రలో కూర్చొబెడితే తెలుగు తమ్ముళ్లు అంతాజేరి "అన్నా తిరుమలరాయ కన్నొక్కటి కలదుగాని కౌరవపతివే" అని పాడుకోవలసి వస్తుంది. 




కొసమెరుపు:
తెలంగాణకు వ్యతిరేకంగా లగడపాటి ఏ చిన్న ప్రకటన చేసినా దాన్ని ఈనాడు పత్రిక బాక్స్ న్యూస్ లా మొదటి పేజిలో ప్రచురించేది. కానీ కాలం మారింది. అదే లగడపాటి ఇప్పుడు బాబు గారి యాత్రను ఆడ్డుకుంటానని ప్రకటించడంతో
ఈ రోజు మొదటి పేజీలో పోలీసొళ్లు విప్పించారో లేద తానే విప్పి కూర్చున్నాడో తెలియదు గాని సల్మాన్‌ఖాన్ పోజులో ఉన్న కలర్ ఫోటోను మొదటి పేజీలో ప్రచురించి ప్రభుభక్తిని చాటుకుంది.

Friday 18 January 2013

నేను మొదటి నుండి తెలంగాణ వాదినే!!


మళ్ళీ రాష్ట్రంలో కాక మొదలైంది. నాయకుల మాటల్లో హాస్యం పెరిగింది. తెలుగు చానల్స్ ఊహాగానాలకు ఉప్పుకారం చల్లి వార్తల్లాగా వడ్డిస్తున్నాయి.

నిన్న రాత్రి ఏబీఎన్ చానల్ వారు బిగ్ డిబేట్లో శైలజానాథ్, కేశవరావు, పబ్బం హరిని కేమరా ముందుకు తెచ్చారు. చర్చ మొదట్లోనే నేను ఎవరితో డిబేట్లో పాల్గొనను అని కేశవరావు స్పష్టం చేసారు. ఆర్కే కోరిక మేరకు ఆయనతోనే మాట్లాడతానన్నారు.

చర్చ శైలజానాథ్‌తో మొదలై మొన్న వాయిలార్ రవి గారు టీజీ వెంకటేష్ బృందంతో అన్న మాటలపై, తెలంగాణ ఇస్తే హైదరాబాద్ పరిస్తితి ఏంటి అన్న విశయాలపై ఇంకా చాలా సమస్యలపై విశ్లేషణ పేరుతో ఓ గంటకు పైగా ఈకలు పీకారు. హరి గారు మాత్రం తెలంగాణ వచ్చిన రాకున్న పెద్ద తేడా ఉండదు అన్నట్లు ఉన్నా శైలజానాథ్ గారి మొహంలో మాత్రం నిస్తేజం కొట్టొచ్చినట్లుగా కనబడింది. అంతా అయిపోయింది అన్నట్లుగా కూర్చున్నాడు. ఇంతకుముందు ఉన్న దూకుడు లేదు. రాజీనామా చేస్తాం అని మాటవరసకు కూడా అనలేదు సరి కదా చివరికి ఆర్కే గారి బలవంతం మీద తను క్రమశిక్షణగల కాంగ్రేస్ కార్యకర్తనని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు.


పెద్దగా కొత్త విశయాలు ఎవరూ పంచుకోక పోయినా, ఒక విశయం మాత్రం నవ్వు తెప్పించింది. మాటల సందర్భంలో శైలజానాథ్ ఆర్కే గారిని మీరు సమైక్యవాది అంటే వెంటనే లేదు లేదు నేను మొదటి నుండి తెలంగాణ వాదినే!! చెప్పుకోవడం.

తెలంగాణ వార్తల విశయంలో ఆర్కే గారి పత్రిక చేసే యాగి అందరికి తెలిసిందే. చిలువలు పలువలు చేయడం, గోరంతను కొండంత చేయడం తెలంగాణ నాయకుల్లో విభేదాలు సృష్టించడానికి పడరాని పాట్లు పడి చీకొట్టించుకోవడం నేను గమనించిన సంగతులు.

ఏ మాత్రం ప్రాధాన్యతలేని బాబు గారి యాత్రకు అదేదో చంద్రమండల యాత్రలా చంద్రయాన్ అని పేరుపెట్టి రోజూ డబ్బాగొట్టే సారు ఇప్పుడు నేను తెలంగాణా వాదిని బుకాయించడం నిజంగా హాస్యస్పదం.